న్యూ ఢిల్లీ : అట్టారీ- వాఘా బార్డర్ను పాకిస్థాన్ తిరిగి తెరిచింది. భారత్ నుంచి వస్తున్న తమ పౌరులు స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాఘా సరిహద్దు వద్ద గేట్లను శుక్రవారం ఉదయం ఓపెన్ చేసింది. దీంతో బార్డర్లో చిక్కుకుపోయిన చాలా మంది పాక్ జాతీయులు ఇవాళ ఉదయం తమ దేశంలోకి అడుగుపెట్టారు. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తాత్కాలిక వీసాపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ రెండు దేశాలూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి డెడ్లైన్ కూడా విధించాయి. ఆ గడువు ముగియడంతో పాకిస్థాన్ గురువారం ఉదయం 8 గంటలకు సరిహద్దును మూసివేసింది. ఈ సరిహద్దు వద్ద పాకిస్థాన్ పౌరులు తమ దేశంలోకి వెళ్లేందుకు వేచి చూస్తుండగానే కౌంటర్లను మూసివేసింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని పేర్కొంది. దీంతో డజన్ల కొద్దీ పాక్ పౌరులు ఆ సరిహద్దు వద్దనే నిలిచిపోయారు. తాము అసలు ఏ దేశానికి చెందిన వారిమో తెలియక మహిళలు, వృద్ధులు, పిల్లలు తలదాచుకునే ప్రదేశం కూడా లేక, ఆకలితో అల్లాడారు. పాకిస్థాన్ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తమ సొంత పౌరులను దేశంలోకి రానీయకపోవడమేమిటని మండిపడుతున్నారు. అయితే పాకిస్థాన్ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీస్ జారీ చేసేవరకు అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా సరిహద్దును పాక్ తెరిచి.. తమ పౌరులను స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పించింది.