అమరావతి: రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆయణ్ని ఏ6గా బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదుతో ఆయన పరారైనట్లు సమాచారం. పీడీఎస్ బియ్యం మాయం కేసులో నిందితుల నుంచి సేకరించిన ఆధారాలతో పేర్ని పేరును పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ఈ క్రమంలోనే మిల్లర్ల నుంచి లారీ డ్రైవర్కు, లారీ డ్రైవర్ నుంచి నిందితులకు నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ పే, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీలను సేకరించారు. పేర్ని నాని ఆదేశాల మేరకే నగదు లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. త్వరలోనే పోలీసులు పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశముంది. మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్జైలుకు తరలించారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధను ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితుల్లో గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగరాజు ఉన్నారు.