న్యూఢిల్లీ : రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు (కరావాల్ నగర్, బాదర్పూర్) నుంచి సిపిఎం పోటీ చేయనుంది. ఈ మేరకు ఢిల్లీ సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. కరావాల్ నగర్ నుంచి సిపిఎం అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది, గుర్తింపు పొందిన సామాజిక కార్యకర్త అశోక్ అగర్వాల్ పోటీ చేయున్నారు. అశోక్ అగర్వాల్ తాను వేసిన వివిధ పిటీషన్లు ద్వారా ప్రభుత్వ పాఠశాల ప్రవేశాల్లో అవకతవకలు, కనీస సౌకర్యాల లేమిని నివారించగలిగారు. అశోక్ అగర్వాల్ పిటీషన్ల కారణంగానే ప్రైవేట్ పాఠశాలల్లో 20 శాతం సీట్లు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు లభించాయి. గుర్తించిన 47 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇడబ్ల్యూఎస్ కేటగిరి కింద 10 శాతం ఇన్పేషంట్లను, 25 శాతం అవుట్ పేషంట్లకు చికిత్స అందిస్తున్నారు.బాదర్పూర్ నుంచి జగదీష్ చాంద్ శర్మను సిపిఎం పోటీకి నిలిపింది. మీఠాపూర్కు చెందిన జగదీష్ ఈ ప్రాంతంలో జరిగిన అన్ని ప్రజా పోరాటాల్లోనూ ముందున్నారు. ఈ ప్రాంతంలో ఒక ప్రధాన భాగాన్ని ‘ఓ’ జోన్లో ఉంచడానికి ఢిల్లీ డెవలెప్మెంట్ అథారిటీ (డిడిఎ) నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి నిర్ణయంతో నిర్మాణ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, మొత్తంగా ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన జీన్స్ డైయింగ్ యూనిట్లు, ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించారు.