కౌరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 31ను నింగిలోకి విజయవంతంగా పంపింది. భారత కాలమానం అనుసారం బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు జీశాట్ -31 ఉపగ్రహాన్ని ఏరియానా రాకెట్ నింగిలోకి మోసుకుపోయి 42 నిమిషాల వ్యవధిలో కక్ష్యలోకి చేర్చింది. ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. జీశాట్ -31తో బాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ -4 ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సమాచార సేవలందించే సామర్థ్యం కల్గిన ఈ ఉపగ్రహం బరువు 2,535 కిలోలు. అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థ ఉన్న జీశాట్ -31 ఇస్రో సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్శాట్, జీశాట్లకు ఆధునిక రూపమని నిపుణులు చెబుతున్నారు. భారతీయ భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఈ ఉపగ్రహం వీశాట్ నెట్వర్క్స్, టెలివిజన్ అప్లింక్స్, డిజిటల్ శాటిలైట్, డీటీహెచ్ టెలివిజన్, సెల్యులార్ బ్యాకప్లకు అనుకూలమైన సాంకేతికత సొంతం చేసుకున్నట్లు ఇస్రో పేర్కొంది. ఇప్పటికే భూస్థిర కక్ష్యలో ఉన్న ఇతర సమాచార ఉపగ్రహాలతో చేరి ఇది అదనపు సేవలు అందిస్తుంది.