దురదృష్టం…మీ అంచనాలను అందుకోలేకపోయాం

దురదృష్టం…మీ అంచనాలను అందుకోలేకపోయాం

చరణ్ పశ్చాత్తాపం

హైదరాబాద్‌: ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ, ఆదరణను ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో అందరూ మెచ్చే సినిమాలు చేస్తానని కథానాయకుడు రామ్‌చరణ్ అన్నారు. ఆయన ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని ఉద్దేశిస్తూ మంగళవారం‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా మీ అంచనాలను అందుకోలేకపోయామన్నారు. ‘ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు.. నా పట్ల, మా సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానాలకు వినయపూర్వక ధన్యవాదాలు. మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్య అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృతజ్ఞతలు. మీ అందరికీ నచ్చి, వినోదం పంచే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాను అందించలేక మీ అంచనాలని అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అన్ని వేళలా మద్దతు అందించిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. ప్రేమతో.. మీ రామ్‌చరణ్‌’ అంటూ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ‘వినయ విధేయ రామ’ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. కియారా అడ్వాణీ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ చరణ్‌ క్రేజ్‌ వల్ల సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టిందని విశ్లేషకులు అంచనా వేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos