న్యూఢిల్లీ: అస్సాంలో నిర్వహిస్తున్న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) ప్రక్రియ లో కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియను మొత్తం అస్తవ్యస్తం చేయడానికి కేంద్రం ఏవేవో కథలు చెబుతున్నదని మండిపడింది. ఎన్నికల్లో మోహరించడానికంటూ అస్సాంలో ఉన్న 167 కంపెనీల సాయుధ బలగాలను ఉపసంహరించుకుంటామని కోర్టులో కేంద్ర హోంశాఖ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఎన్ఆర్సీ అంశంలో కేంద్రం సహకరించడం లేదని, హోంశాఖ తీరు చూస్తుంటే ఈ ప్రక్రియను ధ్వంసం చేసేలా కనిపిస్తున్నదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఎన్ఆర్సీని అయినా నిలిపేయండి అని కేంద్రం కోరింది. దానికీ కోర్టు నిరాకరించింది. ఎన్నికలు, ఎన్ఆర్సీ కలిసి సాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీని కొనసాగించాలని కేంద్రం అనుకుంటే.. 1001 మార్గాలు ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్ఆర్సీ ప్రక్రియకు విఘాతం కలగకుండా రాష్ట్రంలోని సదరు అధికారులను ఎన్నికల విధులకు వాడుకోకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది