న్యూ ఢిల్లీ: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయి తెలిపారు. ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బృందాన్ని సీబీఐ డైరెక్టర్ సూపర్ వైజ్ చేయాలన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది భక్తులకు సంబంధించిన అంశమని.. ఇందులో రాజకీయ డ్రామా వద్దని సుప్రీంకోర్టు కోరింది. తిరుపతి లడ్డూ వివాదంపై శుక్రవారం ఉదయం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిష్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (సిట్)ను కొనసాగించాలా? లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని గత విచారణలో సుప్రీంకోర్టు అడిగిన దానికి ఆయన బదులిచ్చారు. లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు నిజమైతే అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ కేసు విచారణకు సిట్ విచారణ ఒక్కటే సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండటం మంచిదని తెలిపారు..వైవీ సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. నెయ్యి కల్తీ జరిగింది టీడీపీ సమయంలోనే అని ఆయన కోర్టుకు తెలిపారు. నెయ్యిలో కల్తీ ఉంటే లోపలికి ఎందుకు అనుమతించారని ప్రశ్శించారు. ఈ వ్యవహారంపై సీఎం మాట్లాడరని.. నిన్న మరొకరు మాట్లాడరని చెప్పారు. ఇలాంటి సమయంలో సిట్ దర్యాప్తును సరికాదని పేర్కొన్నారు. దీంతో వాదనలు విన్న ధర్మాసనం.. ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది.