ఢిల్లీ: టమాటా దిగుబడులు భారీగా తగ్గటంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తీవ్రమైన వేడిగాలుల కారణంగా గడిచిన 20 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు రెండింతలు పెరిగి కిలోకు రూ.50కి వద్ద స్థిరపడ్డాయి. తెలంగాణలో కిలో టమాటా ధర రూ.80కిపైగా పలుకుతోంది. ఉత్తర భారతదేశంలో ధరలు స్థిరంగా ఉన్నాయి. సరఫరా కొరతతో జులైలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.60కిపైనే పడుతోంది. గత రెండు, మూడు వారాలలో గతేడాది కంటే ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. బెంగళూరులోని రిటైల్ మార్కెట్లో కిలో టమాటలు రూ.80 పలుకుతోంది. “ఈ ఏడాది చాలా రోజులపాటు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ఫలదీకరణ దశలో పంటను దెబ్బతీసింది. ఫలితంగా ఉత్పత్తి తగ్గింది. సరఫరా ఎక్కువగా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి” అని మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పింపాల్గావ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ) అధికారి సచిన్ పాటిల్ చెప్పారు.