న్యూఢిల్లీ : లోక్సభ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)లో 102 స్థానాలకు పోలింగ్ జరగనున్నది. తొలి దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వారిలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ ఉన్నారు.వీరిలో బీజేపీ అగ్రనాయకులు, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు. 2014లో ఆయన ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన విలాస్ ముత్తెంవార్ను 2.84 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. 2019లో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేను 2.16 లక్షల ఓట్లతో ఓడించి సీటును నిలబెట్టుకున్నాడు.కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2004 నుంచి మూడుసార్లు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రిజిజు ప్రధాన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నబమ్ టుకీ కావటం గమనార్హం. దీంతో అక్కడ పోటీ తీవ్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బనాద సోనోవాల్ అసోంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలికి టిక్కెట్ ఇవ్వకపోవటంతో రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ను దిబ్రూగఢ్ నుంచి బీజేపీ పోటీకి దింపింది.యూపీలోని ముజఫర్నగర్ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన హరీంద్ర మాలిక్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతి, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి సంజీవ్ బలియన్ బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో కేంద్ర మంత్రికి విజయం కష్టమేనని అంటున్నారు. ఇక మోడీ క్యాబినెట్లో రెండు పర్యాయాలు పార్లమెంటేరియన్గా, జూనియర్ మంత్రిగా పనిచేసిన జితేంద్ర సింగ్ ఉదంపూర్లో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్.. రాజస్థాన్లోని అల్వార్ జిల్లా మత్స్య ప్రాంతానికి చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్తో పోటీలో ఉన్నారు. ఇక్కడ యాదవ్ సామాజికవర్గం కీలక పాత్రను పోషించనున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. కాంగ్రెస్ మాజీ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్తో పోటీ పడనున్నారు.తమిళనాడులోని నీలగిరి లోక్సభ నియోజకవర్గం ప్రస్తుత డీఎంకే ఎంపీ, మాజీ టెలికాం మంత్రి ఎ. రాజాపై బీజేపీ నుంచి కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇదే తొలిసారి కావటం గమనార్హం.శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం తన తండ్రి ఏడుసార్లు గెలుపొందిన స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి టి. దేవనాథన్ యాదవ్, ఏఐఏడీఎంకే నుంచి జేవియర్ దాస్లు బరిలో ఉన్నారు.తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ రాష్ట్రంలోని కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, అక్కడి నుంచి డీఎంకే నాయకుడు గణపతి పి. రాజ్కుమార్, ఏఐఏడీఎంకేకు చెందిన సింగై రామచంద్రన్తో అన్నామలై పోటీ పడనున్నారు.ఇక క్రియాశీల రాజకీయాల్లోకి రావటానికి ఇటీవల తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్.. బీజేపీ నుంచి చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ సోదరి అయిన కనిమొళిపై 2019 ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి పోటీ చేసిన సౌందరరాజన్.. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా, కనిమొళి.. తూత్తుకుడి స్థానం నుంచి తిరిగి విజయం సాధించాలని చూస్తున్నారు. ఇక ఆమెపై ఎన్డీయే మిత్రపక్షమైన తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) ఎస్.డి.ఆర్ విజయశీలన్ను, ఏఐఏడీఎంకే ఆర్. శివసామి వేలుమణిని పోటీకి దింపాయి.
కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్.. చింద్వారా నుంచి మళ్లీ ఎన్నిక కావటానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 1980 నుంచి తొమ్మిది సార్లు ఈ సీటును గెలుచుకున్న కమల్ నాథ్.. ఈ సారి కూడా తన కుమారుడిని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. 2019 ఎన్నికలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 స్థానాలకు గాను 28 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది. అయితే చింద్వారా నుంచి నకుల్ మాత్రం 37,536 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించాడు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్కు చెందిన ఏకైక ఎంపీగా ఉన్నారు.త్రిపురలో ఉన్న రెండు లోక్సభ నియోజకవర్గాలలో.. పశ్చిమ త్రిపుర స్థానానికి మాజీ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిష్ కుమార్ సాహా పోటీ చేయనున్నారు. ఇక్కడ పోటీ చాలా గట్టిగా ఉండనున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అసోంలోని కలియాబోర్ ఎంపీగా 2014 నుంచి రెండుసార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన, లోక్సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోరు కుమారుడు గౌరవ్ గొగోరు.. ఈ సారి పొరుగున ఉన్న జోర్హాట్లో పోటీ చేయనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన టోపోన్ కుమార్ గొగోరు ఇక్కడి నుంచి విజయం సాధించారు. మణిపూర్ న్యాయ, విద్యా శాఖ మంత్రి బసంత కుమార్ సింగ్ ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనపై జేఎన్యూ ప్రొఫెసర్, కాంగ్రెస్ అభ్యర్థి బిమల్ అకోయిజామ్ పోటీ చేయనున్నారు. మెయిటీ కమ్యూనిటీకి చెందిన బసంత్ కుమార్ సింగ్.. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన తౌనోజం చావోబా సింగ్ కుమారుడు.ఉత్తర రాజస్థాన్లోని బీజేపీకి పట్టు ఉన్న స్థానం చురు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా దేవేంద్ర ఝఝరియా( రెండుసార్లు పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ త్రోయర్), కాంగ్రెస్ నుంచి రాహుల్ కస్వాన్లు బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య బలమైన పోటీ ఉండనున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా, పార్టీ టికెట్ నిరాకరించటంతో రాహుల్ కస్వాన్ మార్చిలో రెండుసార్లు బీజేపీని వీడారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తున్నారు.కాగా, 18వ లోక్సభకు ఎన్నికయ్యే 543 స్థానాలకు గానూ మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనున్నది. 19 నుంచి మొదటి దశ ప్రారంభం కానున్నది. జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.