‘రాహుల్‌ జీ.. త్వరగా కోలుకోండి’

‘రాహుల్‌ జీ.. త్వరగా కోలుకోండి’

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన సత్యాగ్రహ ధర్నాకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించడంపై భాజపా వ్యంగాస్త్రాలను సంధించింది. గతంలో శారదా కుంభకోణం విషయంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ భాజపా ఓ ట్వీట్‌ చేసింది. ‘మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న రాహుల్‌ జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’ అని ట్వీట్‌లో పేర్కొంది. దేశంలోని వ్యవస్థలపై మోదీ, భాజపా చేస్తున్న దాడుల్లో ఇది భాగమని రాహుల్‌ నిన్న ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.2016లో పలు ప్రచార కార్యక్రమాల్లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్లను భాజపా పోస్టు చేసింది. అందులో ‘శారద చిట్‌ఫండ్‌ కుంభకోణం కారణంగా దాదాపు 20 లక్షల మంది ప్రజలు తమ నగదును పోగొట్టుకున్నారు. అవినీతిని రూపుమాపుతానని మమతా జీ అన్నారు. కానీ దానికి బదులుగా ఆమె బెంగాల్‌ను దోచుకుంటున్న వారిని కాపాడుతున్నారు. శారదా కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి. పశ్చిమ బెంగాల్‌లో సిండికేట్‌ రాజ్‌, మాఫియా రాజ్‌ నడుస్తుంది’ అంటూ రాహుల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్ల ఫొటోను భాజపా పోస్టు చేసింది. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్‌ మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారంటూ వ్యంగాస్త్రాలు సంధించింది. ‘ఇటువంటి వ్యాధితో బాధపడే వాళ్లు గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. వాటిని మరిచిపోతారు. రాహుల్‌ జీ.. త్వరగా కోలుకోండి’ అంటూ భాజపా ట్వీట్‌ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos