షాజహాన్పూర్ : ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ నేతలు బరితెగించారు. కాంట్రాక్టర్ తమకు కమీషన్ ఇవ్వలేదన్న అక్కసుతో ఏకంగా బుల్డోజర్తో రోడ్డును ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నిర్మాణ సంస్థ కార్మికులపై దాడికి దిగారు. రోడ్డు నిర్మాణ కంపెనీ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కట్రా స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే వీర్విక్రమ్ సింగ్ అనుచరుడు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడని రమేశ్ సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం తాను ఎమ్మెల్యే ప్రతినిధినని రోడ్డు నిర్మాణ సంస్థ ఉద్యోగులకు పరిచయం చేసుకొన్న జగ్వీర్ సింగ్ రోడ్డు నిర్మిస్తున్నందుకు 5 శాతం కమీషన్ ఇవ్వాలని పలుమార్లు రోడ్డు నిర్మాణ కంపెనీనిని డిమాండ్ చేశాడు. జైతిపూర్-బుదాన్ జిల్లా మధ్య రోడ్ నిర్మాణం జరుగుతున్నది. అయితే కమీషన్ ఇవ్వలేదన్న కోపంతో ఈ నెల 2న జగ్వీర్ సింగ్ 15-20 మందితో కలిసి రోడ్డు నిర్మిస్తున్న కార్మికులను కర్రలతో చితకబాది బుల్డోజర్తో అర కిలోమీటర్ మేర రోడ్డును తవ్వేశాడు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై ప్రజా పనుల శాఖ నుంచి సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకొంటామని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ పాండే వెల్లడించారు. పోలీస్ బందోబస్తు మధ్య రోడ్డు నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయని తెలిపారు. రోడ్డు తవ్వకంపై ఘటనపై ఎమ్మెల్యే వీర్విక్రమ్ సింగ్ స్పందిస్తూ నిందితుడు తన ప్రతినిధి కాదని, అయితే అతడు బీజేపీ నాయకుడేనని అంగీకరించారు.