న్యూ ఢిల్లీ: భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూడలేకే భాజపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో జోరు పెంచిందని ఆరోపించింది కాంగ్రెస్. గోవాలో 8 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు బుధవారం కమలదళంలో చేరడం భాజపా చేపట్టిన ‘ఆపరేషన్ కీచడ్(బురద)’లో భాగమని దుయ్యబట్టింది. “భారత్ జోడో యాత్ర విజయాన్ని చూసి భాజపా కంగారు పడుతోంది. అందుకే గోవాలో ఆపరేషన్ కీచడ్ను ముమ్మరం చేసింది. యాత్రను తక్కువ చేసి చూపేందుకు ఇప్పటికే భాజపా అసత్య ప్రచారాలు సాగిస్తోంది. అయినా మేము వెనక్కు తగ్గం. భాజపా కుయుక్తులు అన్నింటినీ అధిగమిస్తాం” అని పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ విభాగం బాధ్యుడు జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.