ముంబై : మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న దశలో ఈడీ విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఏప్రిల్లో ఈడీ జప్తు చేసింది. ఈడీ చర్యలను సంజయ్ రౌత్ తప్పుబట్టారు. సమన్లు జారీ చేయడాన్ని ‘కుట్ర’గా అభివర్ణించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు మాదిరిగా తాను గువాహటికి వెళ్లనని అన్నారు. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలీబాగ్లో ఒక సమావేశానికి మంగళవారం హాజరు కావాల్సి ఉన్నందున ఈడీ ముందు హాజరు కాలేనని సంజయ్ రౌత్ తెలిపారు. తర్వాత వచ్చేందుకు అవకాశ మివ్వాలని ఈడీని కోరతానని చెప్పారు. ఆలస్యమైనా విచారణకు మాత్రం తప్పక హాజరవుతానని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తనపై చర్యలు తీసుకుంటు న్నారని మండి పడ్డారు. ఈడీ వెంట భారతీయ జనతా పార్టీ ఉందని విమర్శించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని తమపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రతీకారం కోసం తనపై చర్యలు తీసుకుం టున్నారని, భవిష్యత్లో భాజపా నేతలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.