న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, బీహార్లలో ఉప ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ప్రతికూలంగా వస్తున్నాయి. చాలాచోట్ల విజయ సంబురాలు జరుగుతున్నప్పటికీ.. ఈసీ అధికారిక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. అసన్సోల్ లోక్సభ స్థానంతో పాటు బాలీంగజ్ అసెంబ్లీ సీటులో.. శతృఘ్నసిన్హా, బాబుల్ సుప్రియోలు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దాదాపు వీళ్ల విజయం ఖాయమైంది. అసన్సోల్.. ఇది వరకు బీజేపీ సీటు. ఈ నేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు విజయోత్సవ సంబురాల్లో మునిగిపోయారు. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో.. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఒకటి టీఎంసీ, రెండు కాంగ్రెస్, ఒకటి ఆర్జేడీ(విజయం) ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీహార్లో లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ బబోచాహన్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఘన విజయం సాధించింది. ఆర్జేడీ అభ్యర్థి అమర్ కుమార్ పాశ్వాన్ గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది.
ఛత్తీస్గఢ్ ఖాయిరాగడ్లో కాంగ్రెస్ అభ్యర్థి యశోధ నీలాంబర్ వర్మ ముందజంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర కోల్హాపూర్(నార్త్) అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జైశ్రీ చంద్రకాంత్(అన్నా) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.