విమానం ఓ కరెంట్ పోల్ ఢీకొన్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో. ప్రయాణికులతో ఎస్జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉంది.. ప్రయాణికుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ పోల్ను తాకింది.. స్పైస్ జెట్ సంస్థకు చెందిన ఆ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ప్రయాణికులను విమానం నుంచి దింపి, మరో విమానంలో జమ్మూకు పంపించినట్టు అధికారులు వెల్లడించారు.. మరోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. స్పైస్ జెట్ ప్రతినిధి మాట్లాడుతూ, పుష్ బ్యాక్ సమయంలో, కుడి వైపు రెక్క వెనుక అంచు ఒక పోల్ను తాకిందని.. స్వల్ప నష్టం జరిగిందన్నారు.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేశామని వెల్లడించారు.