చెవిపోగుల కోసం కల్లు తాగించి అక్కాచెల్లిని చంపేశాడు…

  • In Crime
  • January 31, 2019
  • 960 Views
చెవిపోగుల కోసం కల్లు తాగించి అక్కాచెల్లిని చంపేశాడు…

హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అక్కాచెల్లి హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ ఇద్దరు మహిళలు చెవులకు ధరించిన బంగారపు చెవిపోగుల కోసం కల్లు తాపించి చంపేశారు. ఈ కేసును ఛేదించిన క్రమాన్ని పోలీసులు వివరించారు.

మీర్‌పేట పోలీసు పరిధిలో బాలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద నివసిస్తున్న యాదమ్మ (50), సుమిత్ర (45) అనే ఇద్దరు మహిళలు అక్కాచెల్లెళ్లు. వీరిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉంది. దీంతో వీరిద్దరూ కలిసి కంచన్‌బాగ్‌ పీఎస్ పరిధిలోని దత్తు నగర్ కల్లు దుకాణ ప్రాంగణానికి వెళ్ళి కల్లు సేవిస్తుంటారు.వీరికి జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో పని చేసే అంకురి గిరి అలియాస్ గిరి అమ్మ (34) అనే పారిశుద్ధ్య కార్మికుడుతో కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి కల్లు సేవించసాగారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు మహిళలు ధరించిన బంగారపు చెవి పోగులపై గిరి అమ్మ కన్నుపడింది.ఈ నేపథ్యంలో ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కల్లుదుకాణానికి వెళ్లిన గిరి… అక్కడ కల్లు సేవిస్తున్న అక్కా చెల్లెళ్లను గమనించాడు. వారికి మాయలు, మంత్రాలు నేర్పిస్తానని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశానికి వెళుతూ మరో రెండు సీసాల కల్లు కూడా కొనుక్కొని వెళ్లారు.

ఆ తర్వాత తాను వేసుకున్న పథకం ప్రకారం… నిర్జన ప్రదేశానికి వెళ్లాక ముఖానికి పసుపు రాసుకోవాలని చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముఖానికి పసుపు రాసుకుని నిల్చొన్నారు. వారి వెనుక వైపునకు వెళ్లిన గిరి అమ్మ తలపై బండరాయితో బలంగా కొట్టాడు. దీంతో వారిద్దరూ కిందపడిపోవడంతో చెవి పోగులు, వారి వద్ద ఉన్న ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మెడకు చీర చుట్టి.. మృతదేహాలను మూసీ నదిలో పడేశాడు.ఈ జంట హత్య కేసును తొలుత అనుమానాస్పద కేసులుగా నమోదు చేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరిపారు. ఇందులోభాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అసలు నిందితుడుని గుర్తించి అరెస్టు చేశారు. అతని నుంచి మొబైల్ ఫోనుతో పాటు.. చెవి పోగులను స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos