విజయవాడ: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కార్పొరేట్ శక్తులకు మేలు చేయడమే మోదీ పాలన. కరోనా సమయంలో కేవలం అంబానీ, అదానీల ఆస్తులు మాత్రమే రెట్టింపయ్యాయి. 2014కు ముందు అదానీ ఎవరో చాలా మందికి తెలియదు. కానీ, ఇప్పుడు ఆయన టాప్ బిలియనీర్ అయ్యారు.మోదీ ప్రధాని అయ్యే సమయంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 62 మాత్రమే. ఇప్పుడు రూ. 108కి చేరింది. పెరిగిన ధరల పట్ల విపక్షాలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలను చేపడుతుంటే… బీజేపీ నేతలు సిగ్గు లేకుండా అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నారు. కరోనా టీకాల్ని సకాలంలో అందించటంలో సమాఖ్య ప్రభుత్వం ఘోరంగా విఫలమయింది. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. సమాఖ్య ప్రభుత్వం కూడా అదే స్థాయిలో అప్పులు చేసింది. మోదీ దేశ అప్పులను రూ. 47 లక్షల కోట్ల నుంచి రూ. 119 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. సాధారణ ప్రజలను మోదీ ప్రభుత్వం గాలి కొదిలేసింది. బీజేపీ చేయాల్సింది జన ఆశీర్వాద యాత్ర కాదు. జన వంచన యాత్ర. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అన్నీ చేసినట్టు మంత్రి కిషన్ రెడ్డి చెపుతుండటం దారుణం. ఏపీకి ఎవరూ చేయనంత అన్యాయాన్ని మోదీ చేశార’ని మండిపడ్డారు.