దిల్లీ: మొదటి సారి తన సర్వే ఫలితాలు తారుమారయ్యాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘2003 నుంచి అనేక రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో సర్వేలు చేశా. పార్టీలు, మీడియాతో సర్వే వివరాలు పంచుకున్నాను. ఎప్పుడూ సర్వే వివరాల్లో పెద్దగా తేడా రాలేదు. మేం చేసిన సర్వే ఫలితాలు మొదటిసారి తారుమారయ్యాయి. పోలింగ్ శాతం వివరాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. ఆ వివరాలు చెప్పడానికి ఈసీకి ఒకటిన్నర రోజులు పట్టింది. ఎలక్ట్రానిక్ యుగంలో ఇంత సమయం ఎందుకు పట్టింది. తెలంగాణ ఎన్నికల్లో గణనీయంగా డబ్బు ప్రభావం ఉందని చెప్పా. ఇబ్రహీంపట్నం సహా వివిధ నియోజకవర్గాల్లో వీవీ ప్యాట్లు లెక్కించాలని కోరారు. వీవీ ప్యాట్లు లెక్కిస్తే అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. వీవీ ప్యాట్ల లెక్కింపుపై హైకోర్టులో కేసు విచారణ జరగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష బలం గణనీయంగా పెరిగింది.’ ‘గత కొన్ని రోజులుగా నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందిచాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చా. ఎవరి ప్రలోభాలకు నేను లొంగే వ్యక్తిని కాదు. స్వతంత్ర వ్యక్తిని. చెప్పిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకున్నా. ఎంతో మంది ఒత్తిడి చేసినా మళ్లీ రాజకీయాల్లోకి రాలేదు. పోలింగ్కు సంబంధించి రాజకీయ పార్టీలకు అనేక అనుమానాలు ఉన్నాయి. నా సర్వే తప్పయితే తప్పని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా వల్ల ఎక్కడైనా తప్పు జరిగితే క్షమాపణ చెబుతా. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్కు ముందు సర్వే వివరాలు చెప్పను. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే చెబుతాను. నేను మాటమీద నిలబడే వ్యక్తిని. నా అనుమానాలు నివృత్తి చేసుకున్నా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వివరాలు వెల్లడిస్తా’’ అని రాజగోపాల్ వెల్లడించారు.