లక్నో : ఉన్నవో లో పోలీసులు దెబ్బలకు 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కరోనా కట్టడికి ప్రభుత్వం మే 24 ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. 17 ఏళ్ల బాలుడు కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించాడని అక్కడి ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డు కలిసి బాలుడిని తీవ్రంగా కొట్టారు. అతడి పరిస్థితి విషమించడంతో వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పోలీసు చర్యతో ఆగ్రహించిన కుటుంబీకులు, స్థానికులు లక్నో రోడ్ క్రాసింగ్ వద్ద రహదారిని దిగ్బంధం చేశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు బాలుడి మృతికి కారణమయిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డును వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేపట్టారని పోలీసులు తెలిపారు.