లక్నో: ఉన్నావ్ జిల్లా ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జ్లు అయిన 16 మంది సీనియర్ వైద్యులు బుధవారం సాయంత్రం సామూహిక రాజీనామా చేశారు. తమకు ఉన్నతాధికారులనుంచి సహకారం లేకపోగా, వేదింపులకు గురవుతున్నందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. నిరంతర సమీక్ష సమావేశాల పేరిల వేదిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జులగా ఉన్న 11మంది వైద్యులు, జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్న ఐదుగురు వైద్యులు మొత్తం ఉన్నావ్ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ అశుతోష్ కుమార్కు తమ సామూహిక రాజీనామాను సమర్పించారు. కరోనా నియంత్రణకు తామంతా చాలా అంకిత భావంతో పూర్తి నిబద్ధతతో విధుల్నినిర్వర్తిస్తున్నప్పటికీ, పై అధికారులపై వేధింపులకు గురిచేస్తూ నియంతృత్వ వైఖరితో ఉన్నారని, అక్రమంగా తమపై చర్యలకు ఉత్తర్వులిస్తున్నారని వాపోయారు. ఎలాంటి వివరణ లేదా చర్చ లేకుండానే జరిమానా విధిస్తున్నారని వైద్యులు ఆరోపించారు. మూకుమ్మడి రాజీనామాల విషయం తనకు తెలియదని వైద్య శాఖ ఉన్నతాధికారి డాక్టర్ అశుతోష్ కుమార్ చెప్పారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, జిల్లా మేజిస్ట్రేట్తో చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు.