బెంగళూరు:రాసలీల సర్కారు, జై శ్రీరామ్ నినాదాల మధ్య ముఖ్యమంత్రి యడ్యూరప్ప సోమవారం లోటున్నా పన్ను పోటు లేని 2021-22బడ్జెట్ ప్రతిపాదనల్ని విధానసభలో ప్రవేశ పెట్టారు. రూ.71,332 కోట్లు అప్పు చేయనున్ననప్పటికీ లోటు రూ.2,573 కోట్లు కావటం గమనార్హం.
కాంగ్రెస్ వాకౌట్ : విధానసభ చరిత్రలో తొలి సారిగా బడ్జెట్ సభను విపక్ష కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సభ ఆరంభమైన వెంటనే విపక్ష నేత సిద్ధరామయ్య బడ్జెట్ను సమర్పించే నైతిక హక్కు ముఖ్యమంత్రి యడ్యూరప్పకు లేదని బిగ్గర స్వరంతో విమర్శించారు. రాసలీల సర్కారుకు అధికారంలో కొనసాగే హక్కు లేదని దుయ్యబట్టారు. దీన్ని ఖాతరు చేయకుండా యడ్యూరప్ప బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. జేడీఎస్ సభ్యులు మాత్రం సభలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాసలీల సర్కారని ఎద్దేవా చేసి సభ నుంచి నిష్క్రమించారు.దీనికి ప్రతిగా పాలక పక్ష సభ్యులు జై శ్రీరామ్ అని బిగ్గరగా నినదించారు.
రాబడిని మించి వ్యయం: 2021-22లో మొత్తం రాబడి రూ.2,43,743 కోట్లు. వ్యయం రూ. 2,46,207 కోట్లు. రెవిన్యూ లోటు రూ.15,134 కోట్లు. వార్షిక దాయంలో రెవిన్యూ రాబడి రూ.1,72,271 కోట్లు కాగా రుణాలు రూ.71,332 కోట్లు. కేంద్ర ప్రభుత్వం వాటా నిధితో సహా వివిధ మూలాల నుంచి నగదు జమ రూ.71,463 కోట్లు. రుణాల వడ్డీ, వాయిదా మొత్తం చెల్లింపు వ్యయం రూ.14,565 కోట్లు.
అప్పులే అప్పులు: ఈ ఏడాది ప్రభుత్వం ప్రతిపాదించిన రుణంతో మొత్తం సర్కారు రుణ భారం రూ.4,57,899 కోట్లుకు పెరుగుతుంది. ఇది వార్షిక స్థూలోత్పత్తి మొత్తం విలువలో 26.9 శాతం. దీనికి అనుగుణంగా ఆర్థిక బాధ్యతా చట్టాన్ని సవరించనున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు. గతంలో ఈ శాతం పాతికను మించ రాదు. ద్రవ్య లోటు రూ.59,240 కోట్లు. ఇది రాష్ట్ర స్థూలోత్పత్తిలో 3.48 శాతం. గతంలో ఇది మూడు శాతం మాత్రమే. కరోనా కారణంగా కేంద్రం ఈ శాతాన్ని నిరుడు ఐదుకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నాలుగుకు కుదించనుంది.