విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్పరంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాతనే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు శనివారం రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. వీరికి స్థానిక వైఎస్సార్సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను చాటి చెప్పారు. ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.