న్యూ ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతో దేశ రైతులకు ప్రమాదం పొంచి ఉందని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 10 మంది ప్రస్తుత, మాజీ ఆర్థికశాస్త్ర ఆచార్యులు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు లేఖ రాశారు. రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికే ఈ చట్టాలు ఉపయోగపడతాయని కేంద్రం చెబుతున్నా వాస్తవం వేరన్నారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల్ని దారుణంగా దెబ్బ తీసే ఈ మూడు చట్టాల్ని రద్దు చేయాలని కోరారు. లేఖపై హైదరాబాద్ యూనివర్సిటీ రిటైర్డ్ ఎకనమిక్ ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో నాబార్డ్ ఛైర్ ప్రొఫెసర్ ఆర్.రామకుమార్ తదితరులు సంతకాలు చేసారు. ‘వ్యవసాయ మార్కెట్ల నియంత్రణా ధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తొలగించటం తప్పు. గ్రామస్థాయిల్లో రైతులకు జవాబుదారీగా అందుబాటులో ఉండేది రాష్ట్రమే తప్ప కేంద్రం కాదు. 2019 జులైలో కేంద్ర వ్యవసాయశాఖ ప్రకారం ప్రైవేటు మండీలు, ఈ-ట్రేడింగ్, ఎలక్ట్రానిక్ పేమెంట్, ఈనామ్లను అనుమతించి 20 రాష్ట్రాలు ఏపీఎంసీ చట్టాలను సవరించాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలోనే ఉండేలా నిబంధన విధించారు. రైతుల నుంచి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల ఇలాంటి వారు కొన్నపుడే సంస్కరణలు విజయవంతమవుతాయి. వ్యవహారాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించే సత్తా రాష్ట్రాలకే ఉంటుంది. అన్నింటికే ఒకే విధానాన్ని అవలంబించాలనే కేంద్ర చట్టం నిష్ప్రయోజనం.కొత్త చట్టం కింద నియంత్రణలు లేని ప్రైవేటు వ్యవస్థ, నియంత్రణల మధ్య నడిచే ఏపీఎంసీ మార్కెట్ యార్డులు ఉంటాయి. ఇప్పటికే వ్యాపారులు నియంత్రిత మార్కెట్ నుంచి అనియంత్రిత వ్యవస్థలోకి వెళ్లిపోతున్నారు. ఒకవేళ ఏపీఎంసీ మార్కెట్లలో అధికారులు, వ్యాపారుల మధ్య లోపాయికారీ ఒప్పందాలు జరగడమే ప్రధాన సమస్య అయితే అదే పరిస్థితి బయటి ప్రైవేటు మార్కెట్లోనూ కనిపించడం ఖాయం. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఏపీఎంసీ మార్కెట్లలో అధికార యంత్రాంగం ఉంది. ప్రైవేటు మార్కెట్లలో అలాంటి వ్యవస్థ ఏదీ ఉండదు. దానివల్ల ధరలతో పాటు, తూకాలు, గ్రేడింగ్, తేమ లాంటి విషయాల్లో రైతులను దోపిడీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.పంటల విక్రయాలు మార్కెట్ యార్డుల బయటే పెద్దఎత్తున సాగుతున్నా రోజువారీ వేలం ప్రక్రియల ద్వారా ఏపీఎంసీ ధరల కొలమానాలను నిర్ధరిస్తున్నాయి. రైతులకు నమ్మకమైన ధరల సంకేతాన్నిస్తున్నాయి. ప్రైవేటు వ్యాపారులు ఎక్కడికక్కడ వ్యాపారాలు నిర్వహించడంవల్ల అక్కడ మార్కెట్ వాతావరణం ఉండదు. దానివల్ల మార్కెట్ పూర్తిగా విచ్ఛిన్నమై గుత్తాధిపత్యానికి దారి తీస్తుంది. వ్యాపారులు సామూహికంగా ఉంటే ఉత్పత్తుల కొనుగోలుకు ప్రత్యక్షంగా పోటీ పడతారు. ఇక్కడ విచ్ఛిన్నంగా ఉండటం వల్ల పోటీ అనేది కనిపించదు. 2006లో బిహార్ ప్రభుత్వం ఏపీఎంసీ చట్టాన్ని రద్దుచేసిన తర్వాత అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులు లేక రైతుల బేరసారాల శక్తి తగ్గిపోయింది. దానివల్ల ఇతర రాష్ట్రాలకంటే అతితక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.కాంట్రాక్ట్ వ్యవసాయం చట్టం భాగస్వాముల మధ్య విపరీతమైన అసమానతలు కల్పిస్తోంది. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన వ్యవస్థ లేదు. భూమి లీజు నిబంధనలను సరళీకరించడంతో కార్పొరేట్ సంస్థలు భారీ మొత్తంలో లీజుకు తీసుకొని కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడానికి వీలవుతోంది. ఒ కాంట్రాక్ట్ వ్యవసాయం అన్నది స్వచ్ఛందమని చెబుతున్నా, వ్యవసాయాన్ని గిట్టుబాటు కాకుండా చేసి రైతులను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడితే వారు విధిలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థలోకి రావటం అనివార్యం. రైతు ప్రయోజనాలకు రక్షణ లేకపోతే ఈ చట్టం వల్ల తలెత్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలు, లైసెన్సులు, నిల్వల పరిమితులు, ప్రాసెసింగ్, మార్కెట్ ఆంక్షల నుంచి వ్యాపార సంస్థలకు విముక్తి కల్పించడం వల్ల మార్కెట్, సప్లైచైన్ అంతా పెద్ద సంస్థల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెరికా, ఐరోపాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అది అంతిమంగా “గెట్ బిగ్ ఆర్ గెటవుట్” అన్న పరిస్థితికి దారితీస్తుంది. వ్యవసాయ వ్యాపారం నుంచి చిన్న రైతులు, వ్యాపారులను బయటికి నెట్టేస్తుంది.