ముంబయి: శుక్రవారం నాటి ట్రేడింగ్లో భారీగా పతనమైన జీ ఎంటర్టైన్మెంట్ షేరు సోమవారం పుంజుకుంది. మార్కెట్ ఆరంభం నుంచి ఈ షేరు కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ తర్వాత చాలా బ్రోకరేజీ సంస్థలు జీ ఎంటర్టైన్మెంట్ షేరుకు బై రేటింగ్ను ఇచ్చాయి. దీంతో నేడు ట్రేడింగ్ ప్రారంభంలో షేరు ధర 14.29శాతం ఎగిసి 365వద్దకు చేరింది. ఆ తర్వాత కొంచెం తగ్గినా కొనుగోళ్ల జోరు మాత్రం కొనసాగుతోంది. సోమవారం ఇన్వెస్టర్ కాల్లో ఒక కీలక విషయాన్ని ఈ సంస్థ వెల్లడించింది. ధరలు పడినా వాటాలను విక్రయించబోమని పేర్కొంది. దీనికి బదులు వ్యూహాత్మక భాగస్వామిని కలుపుకొని పోయే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ‘‘జీ వ్యాపార కార్యకలాపాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ సంస్థ వృద్ధిరేటు ఏటా 19శాతం నమోదవుతోంది. ’’ అని సీఎల్ఎస్ఏ బ్రోకరేజీ సంస్థ పేర్కొంది. మధ్యాహ్నం 12.54 గంటల సమయంలో 9.9శాతం పెరిగి రూ.31 లాభంతో రూ.350.10 వద్ద ట్రేడవుతోంది.