పాట్నా : ముంగేర్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులుగా జిల్లా ఎస్పీ లిపి సింగ్ను తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మగద్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో మొత్తం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. వారంలోపు నివేదికను సమర్పించాలని తెలిపింది. గురువారమూ ముంగేర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు ఎస్పీ ఆఫీస్, పోలీస్ ఔట్పోస్ట్ను ధ్వంసం చేశారు. ఎస్డీఓ కార్యాలయమే లక్ష్యంగా నిరసనకారులు దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాజీవ్ చౌక్లో ఆందోళనకారులు వాహనాల టైర్లకు నిప్పంటించారు. ఈ నెల 26న భక్తులపై కాల్పులకు ఆదేశించిన జిల్లా ఎస్పీ, సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఉద్రిక్త వాతావరణం నెలకొన్నందున పోలీసులు ఆ ప్రాంతంలో కవాతు నిర్వహించారు. .పోలీసుల వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. భక్తులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని జలియన్వాలా బాగ్ ఘటనతో పోల్చింది ఆర్జేడీ.నితీశ్ కుమార్, సుశీల్ కుమార్ మోదీ ప్రభుత్వం సూచనల మేరకే భక్తులపై లాఠీఛార్జీ, కాల్పులు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మొత్తం ఘటనకు సీఎం నితీశ్ బాధ్యత వహించాలని ఆ పార్టీ నేత రణ్దీప్ సుర్జేవాలా డిమాండు చేసారు. ఈ నెల 26న దుర్గామాత నిమజ్జనోత్సవాల సందర్భంగా పోలీసులు, భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జీ చేసి, పరిస్థితులు సద్దుమణగకపోవడం వల్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వేటుకు గురైన ఎస్పీ లిపి సింగ్ తండ్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ జేడీయూ నేత. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆమె 2016 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి.