న్యూఢిల్లీ : కరోనా తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజాన్ని నింపేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పలు చర్యలు ప్రకటించారు. వినిమయాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్ వోచర్, పండుగ ప్రత్యేక అడ్వాన్స్ పథకాలను ప్రవేశపెడుతున్నామని విలేఖరులకు తెలిపారు. ‘ఎల్టీసీ నగదును 12 శాతం, ఆ పై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలి. డిజిటల్ మాధ్యమం ద్వారా వీటిని వెచ్చించాలి. జీఎస్టీ ఇన్వాయిస్ను సమర్పించాలి. కరోనా వైరస్తో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, పేదలు, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ పథకాన్ని ప్రకటించాం. తాజాగా వ్యవస్థలో డిమాండ్కు ఊతమిచ్చే చర్యలను ప్రకటించాం. వస్తువుల కొనుగోలుకు వోచర్లు వాడే అవకాశాన్ని కల్పించాం. తమకు నచ్చిన ప్రాంతానికి, తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఎల్టీసీ సదుపాయం అందుబాటులో ఉంది. వీటిపై ఎలాంటి ఆదాయం పన్ను ఉండదు. ఆర్థిక వ్యవస్థలో దూకుడు పెంచేందుకు వినియోగదారుల నుంచి డిమాండ్, మూలధన వ్యయం పెరగాల్సి ఉంద’ని పేర్కొన్నారు.