నయా రౌలత్ చట్టం

నయా రౌలత్ చట్టం

లఖ్ నవ్ : వారెంట్లు ,న్యాయ స్థానం ఆదేశాలు, ఎఫ్ఐఆర్ తదితరాలు లేకుండా నేరుగా ఎవరినైనా అరెస్టు చేసే అధికారాన్ని పోలీసులకు ఉత్త్ప్రదేశ్ ప్రభుత్వం కట్టబెట్టింది. దీనికోసం ప్రత్యేక భద్రత దళం (ఎస్ఎస్ఎఫ్) పోలీసు శాఖలో ఏర్పాటయింది. ఎవరినైనా అరెస్టు చేయడానికి, వారి ఇళ్లలో/కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడానికి పోలీసు శాఖలోని ఇతర ఏడు విభాగాలకు లేని అధికారాలను ఈ విభాగానికి దఖలు పరిచారు. అరెస్టు చేయడానికి తగిన ఆధారం ఆ విభాగం వద్ద ఉంటే రుసుం చెల్లించి ఎస్ఎస్ఎఫ్ సేవల్ని ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, వ్యక్తులు కూడా ఉపయోగించుకోవచ్చని అదనపు ప్రధాన కార్యదర్శి అవినాశ్ అవస్థి తెలిపారు. ప్రైవేటు వారి కోసం విధులు నిర్వహిస్తున్నప్పుడూ ఈ విభాగానికి అవే అధికారాలు ఉంటాయి. ఈ విభాగంలో పనిచేసే ఎవరిపైనా కేసు పెట్టడానికి వీలుండదు. కోర్టులు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా వీరిపై నేరాలను పరిగణనలో తీసుకునే అవకాశం లేదని ప్రభుత్వ ఉత్తర్వులు చెబుతున్నాయి. మూడు నెలల్లో ఎస్ఎస్ఎఫ్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎస్ఎస్ఎఫ్ కోసం 1918 మందిని కొత్తగా నియమించనున్నారు. మొత్తం 9919 మంది దీనిలో ఉంటారు. ఐదు బెటాలియన్లతో, అదనపు డీజీపీ నేతృత్వంలో ఇది పనిచేయడానికి తొలి దశలో రూ.1746 కోట్లు ఖర్చవుతుంది.గతంలో యూపీ కోర్టుల ప్రాంగణాల్లోనే కొన్ని నేరాలు జరగడంతో ఈ బలగాలను అలహాబాద్ హైకోర్టు, లఖ్నవూ ధర్మాసనం, జిల్లా న్యాయస్థానాల్లో వినియోగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, మెట్రోలు, విమానాశ్రయాలు, బ్యాంకులు, పరిశ్రమల్లోనూ ఎస్ఎస్ఎఫ్ బలగాలను వినియోగిస్తారు. విపక్షాలు, అణగారిన వర్గాల అణచివేతకే ప్రభుత్వం నూతన చట్టాన్ని చేసిందని పీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లాలూ ఆరోపించారు. ఇది 1919 నాటి రౌలత్ చట్టాన్ని తలపిస్తోందని, దీనిని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని చెప్పారు. ప్రైవేటువారీకీ పోలీసు సేవలు అందించాలన్న నిర్ణయం విడ్డూరంగా, ప్రమాదకరంగా ఉందని యూపీ మాజీ డీజీపీ అర్వింద్కుమార్ జైన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య ప్రయోజనాలను కాపాడే రీతిలో ప్రభుత్వ నిర్ణయం లేదని సమాజ్వాదీ పెదవి విరిచింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos