పాకిస్థాన్ మరోసారి సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. తాజాగా గురువారం జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలో వాస్తవాధీనరేఖ వెంట పాకిస్థాన్ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. భారత్లోని పూంచ్, రాజౌరీ సెక్టార్లోని నాలుగు స్థావరాలపై దాడులు చేశాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత బలగాలు దీటుగా స్పందించాయి. బుధవారం సైతం వాస్తవాధీన రేఖ వెంట ఉన్న జమ్మూ కశ్మీర్లో మెందర్ సెక్టార్లోని పలు ప్రాంతాలపై మోర్టార్లు, చిన్నపాటి ఆయుధాలతో పాకిస్థాన్ బలగాలు విరుచుకుపడ్డాయి. తరచుగా జరుగుతున్న ఈ దాడులపై స్పందించిన భారత ప్రభుత్వం గతవారం పాకిస్థాన్ హై కమిషన్కు సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేసింది. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.