హోసూరు : ఇక్కడి అటవీ ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థాలను తెచ్చి పడేయడంతో వన్యప్రాణులకు ముప్పుగా మారింది. హోసూరు-సూలగిరి జాతీయ రహదారికి ఇరువైపులా 3 కి.మీ దూరం దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో ఏనుగులు, అడవి పందులు, జింకలు తదితర వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. ఈ ఆటవీ ప్రాంతాన్ని ఆనుకొని రెండవ పారిశ్రామిక వాడ ఉన్నందున వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. పరిశ్రమలలో పడే వ్యర్థాలను రాత్రి పూట ఆటవీ ప్రాంతంలో పడేసి వెళుతున్నారు. హోసూరు పట్టణంలోని చికెన్ సెంటర్లతో పాటు హోటళ్లలోని వ్యర్థాలను జాతీయ రహదారి పక్కన అటవీ ప్రాంతంలో పడేయడంతో వాటిని తినడానికి వచ్చే వన్యప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయి. కొన్ని వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణులకు ముప్పుగా మారిన వ్యర్థాలను అటవీ ప్రాంతంలో పడవేస్తున్నవారిపై చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.