ముంబయి: టాటామోటార్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకమైన ల్యాండ్రోవర్ ఓమెగా ఆర్క్ ప్లాట్ఫామ్పై నిర్మించిన హారియర్ ఎస్యూవీ వాహనాన్ని నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా మోటార్స్ ఎండీ గుంటెర్ బుట్చేక్, టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ ఫరేక్లు బుధవారం దీనిని ఆవిష్కరించారు. ఈ ఎస్యూవీ ధర 12.69 లక్షల నుంచి రూ.16.25లక్షల వరకు ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన నాలుగో కారు హారియర్ కావడం విశేషం. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్టీ, ఎక్స్జెడ్ అనే వేరియంట్లలో దీనిని విక్రయించనున్నారు.ఈ కారులో నాలుగు సిలెండర్ల 2.0లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ను అమర్చారు. ఈ ఇంజిన్ 350 ఎన్ఎం టార్క్ను 138 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో 6స్పీడ్ మ్యాన్యూవల్ గేర్బాక్స్ను అమర్చారు. ఇందులో మొత్తం ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే డ్రైవింగ్ మోడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 16 అంగుళాల స్టీల్ వీల్స్గానీ, 17 అంగుళాల అలాయ్ వీల్స్తోగా లభిస్తుంది. 7 అంగుళాల టీఎఫ్టీ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, తొమ్మిది జేబీఎల్ స్పీకర్లు, 8.8 అంగుళాల ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి హంగులు ఉన్నాయి.