ముంబై: అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ విస్తరణ, లాక్డౌన్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం ఎన్నిసార్లైనా డబ్బులను ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఖాతాదారులకు లభించింది. వీటికి అదనంగా ఎలాంటి సర్వీస్ ఛార్జీలను వసూలు చేయబోమని బ్యాంకు తెలిపింది. అంతేకాదు ఎస్ బీఐ ఏటీఎంలు మాత్రమే కాకుండా ఏ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఉంటుందని ట్విటర్ వేదికగా ఎస్బీఐ ప్రకటించింది.