హైదరాబాద్ : కరోనా వల్ల చిత్రీకరణలన్నీ ఆగిపోయాయి. ఫిలింనగర్లో చిత్రబృందాల కసరత్తులు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. స్క్రిప్టులకి తుది మెరుగులు దిద్దుకోవడం, నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టడం లాంటి పనులతో బిజీగా గడుపుతున్నారు దర్శకనిర్మాతలు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ కోసం కథానాయికని అన్వేషించే పనిలో పడింది ఆ చిత్ర బృందం. మొదట ఈ చిత్రం కోసం త్రిషని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దాంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కాజల్, అనుష్క తదితర అగ్ర కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. అనుష్క వైపే చిత్రబృందం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లోనూ అనుష్క మెరిసింది. త్వరలోనే ‘నిశ్శబ్దం’తో సందడి చేయబోతోందామె. మరి ‘ఆచార్య’ సరసన ఆమే నటిస్తుందా లేక, మరొకరా అనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.