ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన జేడీ లక్ష్మీ నారాయణ జనసేనలో చేరడానికి, రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితుల గురించి పలు విషయాలు వెల్లడించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని ఓట్లను నోట్లతో కొనబోమని మీరు పార్టీలోకి వస్తే జనసేనకు అదనపు బలం వస్తుందని పవన్కళ్యాణ్ హామీ ఇవ్వడంతో జనసేనలో చేరామని తెలిపారు.పార్లమెంటరీ నియోజక వర్గంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సింబల్ వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం పడుతుంది. 16, 17 రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నాను. రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు 2,80,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఓడిపోయామని మేము ఎన్నడూ అనుకోలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా గెలుస్తామని భావించాం‘ అని తెలిపారు.’పొలీట్ బ్యూరోలో నన్ను ఉండాలన్నారు. ఐదుగురితో పొలిట్ బ్యూరో ఉండడం సరికాదని, ఆ సంఖ్య ఎక్కువ ఉండాలని చెప్పాను. ఆలోచనలు అనేవి అందులో జరగాలని అన్నాను. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుటుందన్నాను. మనం మజ్జిగ చిలికినట్లు నిర్ణయాలను చిలకాలి. ఎక్కువ మంది మదనం చేస్తే మంచి నిర్ణయాలు వస్తాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఆ పొలిట్ బ్యూరోలో నేను లేను. నేను పార్టీలో చేరిన తర్వాత పెద్దగా సమయంలేదు. ఎన్నికలు వచ్చాయి. సమావేశాల్లో పాల్గొన్నాను. నాకు ఇవ్వాల్సిన సలహాలు నేనిచ్చాను‘ అని చెప్పారు. పార్టీలో ఒక్కరే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెప్పామని అందరూ చర్చించాకే ఒక నిర్ణయానికి రావాలని అప్పుడే నిర్ణయాన్ని అమలు చేయడంలో అందరూ చురుకుగా పాల్గొంటారని చెప్పామన్నారు.ఇవేవి జరుగకపోగా నిలకడలేని విధానాలు,నిర్ణయాలు ఎక్కువ కావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చానని వెల్లడించారు..