బెంగళూరు : కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని ప్రసిద్ధ సిద్దగంగ మఠాధిపతి శివకుమారస్వామి(111) సోమవారం ఉదయం 11.44 గంటల ప్రాంతంలో శివైక్యం చెందారు. గత 15రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నట్లు మఠం నిర్వాహకులు ప్రకటించారు. కర్ణాటకలో మూడ్రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జి.పరవేశ్వర చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు కూడా ప్రకటించారు. శివకుమారస్వామిని ‘నడిచే దేవుడి’గా ఆయన ఆరాధకులు పిలుచుకుంటారు. 12శతాబ్దంలోని సంఘసంస్కర్త బసవ రూపంలో జన్మించిన అవతారమూర్తిగా కీర్తిస్తుంటారు. లింగాయత్లకు ఆరాధకుడైన ఆయన సిద్దగంగ విద్యాపీఠానికిఅధిపతిగానూ ఉన్నారు. ఈ విద్యాపీఠం కింద 125 అనుబంధ విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలలు కొనసాగిస్తున్నారు. ఇందులో చదువుకొంటున్న పేద విద్యార్థులకు ఉచితవిద్యతోపాటు, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, సదానంద గౌడ తదితర రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తడంతో గత కొన్నివారాలుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన శివైక్యం చెందారన్న సమాచారం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున మఠానికి తరలివస్తున్నారు. దీంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని వీరపుర గ్రామంలో 1907 ఏప్రిల్ 1న శివకుమారస్వామి జన్మించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మానవతావాదిగా పేరుతెచ్చుకున్నారు. 2015లో ఆయన పద్మభూషణ్ అందుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వాలని గతవారమే కర్ణాటక సీఎం కుమారస్వామి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.