హొసూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో హొసూరు యూనియన్ 16వ వార్డు నుంచి మిత్ర పక్షాల మద్దతుతో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్. సంపత్ కుమార్ భారీ మెజారిటీతో గెలుపొందారు. యువకుడైన సంపత్ కుమార్కు హొసూరు యూనియన్లో ఏ విజేతకూ రాని విధంగా 1,719 ఓట్ల భారీ ఆధిక్యత లభించింది. గత శుక్రవారం పోలింగ్ జరుగగా, సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. హొసూరు యూనియన్ 16వ వార్డులో ఎస్. ముదుగానపల్లి, ముగళూరు, మాచినాయకనపల్లి పంచాయతీలున్నాయి. డీఎంకే జిల్లా శాఖ అద్యక్షుడు, తళి ఎమ్మెల్యే వై. ప్రకాశ్, హొసూరు ఎమ్మెల్యే ఎస్ఏ. సత్య, వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్, డీఎంకే హొసూరు యూనియన్ శాఖ కార్యదర్శి చిన్న పిళ్లప్ప తదితర నాయకుల కృషి, శ్రమ, పట్టుదల వల్లే తనకు ఇంతటి భారీ మెజారిటీ లభించిందని సంపత్ కుమార్ తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇదే సందర్భంలో యూనియన్లోని ఓటర్లు, ప్రజలకు సంపత్ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని, సదా వారికి సేవలందించడానికి ఎల్లప్పడూ అందుబాటులో ఉంటానని వెల్లడించారు.