క్రూర చర్యలతో ప్రపంచాన్ని భయంతో గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ ఐసీస్ మళ్లీ కురులు విప్పుతోంది.దారుణ మారణకాండకు మారుపేరైన ఐసిస్ తన క్రూరత్వాన్ని మరోసారి ప్రపంచానికి వెల్లడించింది. ఈశాన్య నైజీరియాలో బంధించిన 11 మందిని అత్యంత దారుణంగా హతమార్చింది. ఐసిస్ అధినేత అబూబకర్ ఆల్ బాగ్దాది మరణానికి ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రకటించింది. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)తో జట్టుకట్టిన నైజీరియా జీహాదీలు ఈశాన్య నైజీరియా నుంచి ఇటీవల పదకొండు మంది క్రిస్టియన్లను బందీలుగా పట్టుకున్నారు.ఇస్లామిక్ స్టేట్ పశ్చిమాఫ్రికా ప్రావిన్స్ (ఐఎస్డబ్ల్యూఏపీ) జీహాదీలు వీరి కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అక్కడ పది మంది తలలు నరికేశారు. మరొకరిని కాల్చిచంపారు. అనంతరం ‘మేము బందీలుగా పట్టుకున్న 11 మందిని చంపేశాం’ అంటూ ఐసిస్ ప్రచార విభాగమైన అమక్ ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది.