గత నెల 27వ తేదీన జరిగిన దిశ హత్యాచారం అనంతరం పది రోజులకే నిందితుల ఎన్కౌంటర్ ఘటనలు దేశం మొత్తం సంచలనం సృష్టించాయి.నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుండగా కొన్ని మహిళా సంఘాలు,మానవ హక్కుల సంఘాలు,సోకాల్డ్ మేధావులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా దిశ నిందితుల ఎన్కౌంటర్ అనంతరం మహిళలపై ఇటువంటి దారుణాలకు తెగబడ్డ నిందితుల్లో ఎన్కౌంటర్ భయం మొదలైనట్లు తెలుస్తోంది.కొద్ది రోజుల క్రితం ఎన్కౌంటర్ భయంతో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.తాజాగా సంగారెడ్డి జిల్లాలో స్నేహితురాలిని గొంతు కోసి చంపిన కేసులో నిందితుడైన జాదవ్ అరవింద్ (23) కూడా ఉరివేసుకున్నాడు.మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాగాలకు చెందిన అరవింద్ తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడీఏ బొల్లారంలో ఉంటున్నాడు. పదో తరగతి చదువుతున్న స్థానిక బాలికను ప్రేమించిన నిందితుడు.. ఆమె వేరే యువకుడితో చనువుగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. గతేడాది ఆగస్టు 30న ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ ఆపై బెయిలుపై బయటకు వచ్చాడు. ప్రస్తుతం నాందేడ్లోని ఓ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ తర్వాత తనకూ అటువంటి శిక్ష తప్పదని భావించిన అరవింద్ సోమవారం ఉదయం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.