ప్రియాంకా రెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.కాగా ఇద్దరు ప్రభుత్వ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే ప్రియాంక ఈ దారుణానికి బలై ఉండేది కాదని తెలుస్తోంది. ప్రియాంకపై హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు, కేసులో ఏ-1 నిందితుడు ఆరిఫ్ ఐరన్ను లారీలో లోడ్ చేసుకుని తీసుకు వస్తూ మహబూబ్ నగర్ ఆర్టీఓ అధికారులకు పట్టుబడ్డాడు. అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదని లారీ ఓవర్ లోడ్ తో ఉందని గమనించి కూడా సదరు అధికారి కేసు నమోదు చేయకుండా లారీని సీజ్ చేయకుండా వదిలేశాడు. ఇది ఓ నిర్లక్ష్యం.ఆపై లారీని హైదరాబాద్ శివార్ల వరకూ తీసుకు వచ్చిన ఆరిఫ్ దాన్ని తొండుపల్లి దగ్గర అక్రమంగా పార్కింగ్ చేశాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం, లారీ ఎందుకుందన్న విషయాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోవాలంటూ హెచ్చరించి వదిలేశారే తప్ప చర్యలు తీసుకోలేదు. ఈ రెండు ఘటనల్లో ఏ ఒక్కరైనా తమ పనిని సక్రమంగా నిర్వర్తించివుంటే ప్రియాంక ప్రాణాలతో ఉండేది. ఈ విషయాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.