ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయం వ్యవస్థల వల్ల తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందంటూ ఓ అటెండర్ సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన వీడియో పోస్టు వైరల్గా మారింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం బి.పత్తిపాడు పంచాయతీలో అటెండరుగా పనిచేస్తున్న ముత్తేశ్వరరావు అనే వ్యక్తి పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సంచలనం రేపుతోంది. అయ్యా ముఖ్యమంత్రిగారు…నేను 2014 నుంచి అటెండర్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ప్రజావసరాల నిమిత్తం స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంచాయతీలో వాటర్ ట్యాంక్, బోరు బావి, వీధి దీపాల మరమ్మతులు, అధిక వడ్డీలకు అప్పుతెచ్చి పనులు చేయిస్తూ వస్తున్నాను. ఇప్పుడీ సచివాలయ వ్యవస్థతో అవమానాల పాలవుతున్నాం. మాగోడు స్పందనలో వినిపించుకున్నా పట్టించుకున్న వారు లేరు.మా ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయో తెలియక ఆందోళన చెందుతున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నాను. అలాగే నిత్యం నన్ను అవమానిస్తున్న కార్యదర్శి తీరుతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాను. అందుకే జీవితాన్ని ముగించాలని ఈ సెల్ఫీ వీడియో పంపిస్తున్నాను‘ అంటూ వీడియోలో పేర్కొన్నాడు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ జీవో విడుదల చేయాలని కోరాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న సెల్ఫీ వీడియోను గూగుల్ లో పోస్టు చేశాడు.