హొసూరు : పుదీనా ధరలు గత వారం రోజులుగా పెరగడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీన్స్, క్యాబేజీ, టమోటా, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్లు ఇక్కడ ప్రధాన వాణిజ్య పంటలు. కొత్తిమీర, పుదీనా తదితరాలను కూడా విస్తారంగా పండిస్తారు. ఇటీవల హొసూరు ప్రాంతంలో వర్షాలు బాగా కురవడంతో పుదీనా పంట నాశనమైంది. దీనివల్ల ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. 15 రోజుల కిందట ఒక కట్ట పుదీనా ధర ఐదు రూపాయలు ఉండగా ప్రస్తుతం 15 రూపాయలకు పెరిగింది. ఎకరా పొలంలో పుదీనా పంట పెట్టడానికి రూ.20 వేల దాకా ఖర్చవుతుందని, ఆరు సార్లు పంటను కోయ వచ్చని రైతులు తెలిపారు. ప్రస్తుత ధరలు ఇలాగే కొనసాగితే ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆర్జించవచ్చని చెప్పారు.