వివాదాలకు కేంద్రబిందువైన నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.తమ ఇద్దరు కూతుళ్లను నిత్యానందకు చెందిన ఓ ఆశ్రమంలో బంధించారని గుజరాత్కు చెందిన జనార్ధన్ శర్మ అనే వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.స్వామి నిత్యానందకు చెందిన బెంగళూరులోని ఓ విద్యా సంస్థలో తమ నలుగురు కుమార్తెలను (7 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు) చేర్పించామని జనార్ధన్ తెలిపారు.తమ కూతుళ్లను ఈ ఏడాది నిత్యానందకు చెందిన అహ్మదాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఉన్నయోగిని సర్వజ్ఞపీఠం అనే మరో ధ్యానపీఠానికి మార్చారని తెలిపాడు. తమ కూతుళ్లను కలవనివ్వకుండా సంస్థ అధికారులను తమను అడ్డుకున్నారని వారు చెప్పారు. పోలీసుల సహకారంతో శర్మ దంపతులు సంస్థలోకి వెళ్లి తమ ఇద్దరు మైనర్ కూతుళ్లను తీసుకుని రాగలిగామన్నారు.అయితే మరో ఇద్దరు కూతుళ్లు లోపముద్ర జనార్దన శర్మ (21), నందిత (18) తమతో రావడానికి నిరాకరించారని పిటిషన్లో పేర్కొన్నారు.వారిద్దరినీ పీఠానికి చెందిన అధికారులు కిడ్నాప్ చేశారని, చట్ట విరుద్ధంగా బంధించారని ఆరోపించారు. తమ కూతుళ్లను సురక్షితంగా తమకు అప్పగించేలా పోలీసులను, పీఠానికి చెందిన అధికారులను ఆదేశించాలని కోరారు.