సీనియర్ హీరోయిన్ శ్రియ సరన్ పేరుతో ఓ విలేకరి మరికొంత మందితో కలసి సినీ దర్శకుడికి రూ.5లక్షలు కుచ్చుటోపి పెట్టారు.బంజారాహిల్స్, రోడ్ నంబర్ 5లో నివాసం ఉండే చంద్రాయుడు, ఓ చానల్ లో రియాల్టీ షోను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నాడు. దీనికి న్యాయ నిర్ణేతగా శ్రియను పిలిపించాలని భావించాడు. ఈ క్రమంలో చంద్రాయుడికి పరిచయమైన ఓ పత్రిక విలేకరి శ్రియకు మేనేజర్ గా పనిచేసే లక్ష్మీ సింధూజ తనకు పరిచయమని చెప్పాడు. ఆపై ఆమెను పిలిపించి, ఓ హోటల్ లో చర్చలు సాగించారు. శ్రియను ఒప్పిస్తానని సింధూజ చెప్పడంతో ఆమె ఖాతాలో రూ. 5 లక్షలు జమ చేశాడు. ఆపై నెల రోజులు గడిచినా, శ్రియ రాకపోవడం, సింధూజ, సదరు రిపోర్టర్ అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.