తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై హామీ మేరకు సమ్మెను విరమించినట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ప్రకటించారు.గవర్నర్ తమిళిసైని కలిసిన అనంతరం క్యాబ్ డ్రైవర్ల జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మంగళవారం వరకు తనకు సమయం ఇవ్వాలని గవర్నర్ కోరారని తెలిపారు. ఆర్టీసీ సమ్మె మూలంగా జనం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, ఇదే సమయంలో క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె చేస్తే ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గవర్నర్ తెలిపారన్నారు. సమస్య పరిష్కారానికి గవర్నర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే సమ్మెను విరమిస్తున్నట్టు పేర్కొన్నారు.అయితే మంగళవారం కూడా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే అప్పుడు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.