కృష్ణగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకారుల నిరసన ప్రదర్శన
హొసూరు : ఆంగ్లేయుల కాలంలో 1885లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం రైతు వ్యతిరేకి అని ఆరోపిస్తూ, ఆ చట్టం ప్రతులను దహనం చేయడానికి ప్రయత్నించిన 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రమైన కృష్ణగిరిలో బుధవారం ఈ ఆందోళన జరిగింది. జిల్లా వ్యాప్తంగా గ్యాస్ పైప్లైన్లు ఏర్పాటు చేయడానికి భూసేకరణ చేపట్టారు. దీనిపై రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు పట్టించుకోకుండా 1885 భూసేకరణ చట్టం ఆధారంగా రైతుల భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై సీపీఎం అనుబంధ తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం జిల్లా శాఖ కార్యదర్శి ప్రకాష్ ఆందోళనలో పాల్గొన్నారు.