హొసూరు : వర్షా కాలంలో ఏటీఎస్ రకాల దోమల ఉత్పత్తి ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ఎస్. ప్రభాకర్ హెచ్చరించారు. కనుక ఇలాంటి దోమలు ఉత్పత్తి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కృష్ణగిరి మునిసిపాలిటీకి చెందిన ఆరోగ్య శాఖ సిబ్బందికి బుధవారం సూచించారు. పాత టైర్లు, కొబ్బరి చిప్పల్లో వర్షపు నీరు నిల్వ ఉంటుందని, వీటిని తొలగించే విధంగా గడపకు గడపకు వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని కోరారు. ఇదే సందర్భంలో కలెక్టర్ కొత్త బస్టాండును పరిశీలించారు. బస్టాండులో మరుగు దొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, రోజుకు అయిదు సార్లు వాటిని శుభ్రం చేయించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. దుకాణాలను స్వయంగా తనిఖీ చేసి, ప్లాస్టిక్ వినియోగిస్తున్న దుకాణదార్లకు రూ.500 చొప్పున జరిమానా విధించారు. కలెక్టర్ వెంట ఆరోగ్య శాఖ అధికారి మోహన్ సుందరం, మునిసిపాలిటీకి చెందిన ఇతర అధికారులు ఉన్నారు.