ఢిల్లీ : టైమ్ మేగజైన్లో మన దేశంలో రెండింటికి స్థానం లభించింది. వరల్డ్ టాప్ 100 జాబితాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, ముంబైలోని సోహో హౌస్లు చోటు చేసుకున్నాయి. 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా ఉక్కు మనిషి విగ్రహం ఖ్యాతి గడించింది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సోహో హౌస్ అరేబియా సముద్ర తీరంలో ఉంది. పదకొండు అంతస్తులతో ఉండే ఈ భవంతిలో లైబ్రరీ, ఓపెన్ రూఫ్ టాప్ బార్తో పాటు 34 మందికి సరిపడా సినిమా థియేటర్ కూడా ఉంది. నిర్మాణ శైలి, ఇందులో వాడిన ఫర్నీచర్, కళాకృతులతో ఈ భవంతి ప్రత్యేకతను చాటుకుంది. వాస్తవికత, కొత్తదనం, ఆవిష్కరణ, ప్రభావం వంటి అంశాల ఆధారంగా టైమ్ మేగజైన్ ఏటా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రదేశాలను ఎంపిక చేస్తుంది.