కోల్కతా : కశ్మీర్లో అసమ్మతి గళం విప్పుతున్న వారిని భాజపా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బుధవారం ఇక్కడ జరిగిన విద్యార్థుల ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న తనను అరెస్టు చేసినా, భాజపాకు మోకరిల్లబోనని స్పష్టం చేశారు. కశ్మీర్లో పరిస్థితులపై ప్రశ్నిస్తున్నవారిని కేంద్రం అణిచివేస్తోందన్నారు. ప్రభుత్వ సంస్థలకు అధిపతులుగా రిటైర్డ్ వ్యక్తులను నియమిస్తున్నారని, వారు ప్రభుత్వం చెప్పినట్లు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను కేంద్రం డబ్బుతో కొనుగోలు చేస్తోందని, దీనికి లొంగని వారిని వివిధ సంస్థల ద్వారా బెదిరిస్తోందని ఆమె దుయ్యబట్టారు.