ముంబై: కోహినూర్ మిల్లు భూమి కొనుగోలు అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) రాజ్ ఠాక్రే గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. దాదర్లోని కోహినూర్ మిల్లు భూ లావాదేవీలపై అధికారులు ప్రశ్నించారు. ముందు జాగ్రత్త చర్యగా ఈడీ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిషేధా జ్ఞలు విధించారు. ఎమ్మెన్నెస్ కార్యకర్తల కదిలికల నియంత్రణకు 12 జోన్లలో భద్రతను కట్టు దిట్టం చేశారు. ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్పాండేతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం వద్ద కూడా పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు. శాంతి, భద్రతలకు విఘాతం కల్గిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంయమనం పాటించాలని, అందరూ శాంతంగా ఉండాలని రాజ్ఠాక్రే తన అనుచరులకు సూచించారు. ‘మా నాయకుడి ఆదేశాలకు కట్టుబడి సంయమనం పాటిస్తున్నాం. ఆయన చెప్పకపోయినా సహనంగా ఉండాలని అనుకున్నాం. మమ్మల్ని అదుపులోని తీసుకుని ప్రభుత్వం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది’ అని సంతోష్ ధుని అనే నాయకుడు ఆరోపించారు. కోహినూర్ మిల్లు భూ అక్రమాల కేసులో రాజ్ఠాక్రే వ్యాపార భాగస్వాములు ఉమేశ్ జోషి, రాజేంద్ర శిరోద్కర్లను ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించారు.