కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలకు బుధవారం సుప్రీంకోర్టు తెర దించింది.రాజీనామాలు ఆమోదించేలా సభాపతి రమేశ్ను ఆదేశించాలంటూ కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్మేలు దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు రాజీనామాలపై సభాపతిదే తుది నిర్ణయమంటూ స్పష్టం చేసింది. రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా కర్ణాటక శాసనసభలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది.కాగా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని ఎవరూ బలవంతపెట్టలేరని వెల్లడించింది.కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ముంబయిలోని ఓ స్టార్ హోటల్లో పోలీసుల భద్రత మధ్య ఉంటున్న విషయం తెలిసిందే.అయితే సభాపతి రమేశ్కుమార్ మాత్రం ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించకపోవడం మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు రెబల్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.దీంతో తమ రాజీనామాలపై సభాపతి ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని రాజీనామాలు ఆమోదించాలంటూ సభాపతికి ఆదేశాలు ఇవ్వాలంటూ అసంతృప్త ఎమ్మెల్యేలు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.రెబల్ ఎమ్మెల్యేల తరపున ముకుల్ రోహిత్గీ,ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్,సభాపతి రమేశ్ తరపున ఏఎం సింఘ్వి వాదనలు వినిపించారు.మూడు పక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం రాజీనామాలపై సభాపతిదే తుది నిర్ణయమంటూ స్పష్టం చేయడంతో పాటు బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. రేపు జరగనున్న బలపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది..