అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాసపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త తన భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వ్యాసపురంలో నివాసముండే మరన్నకు తన భార్య విశాలపై అనుమానం ఉండేది. దీంతో నిత్యం వారి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మరన్న.. గొడ్డలితో భార్య విశాలను దారుణంగా నరికి చంపాడు. అనంతరం గ్రామ సమీపంలో పొలంలో చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి ఏడాది చిన్నారి, ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రుల మరణంతో వీరు ఒంటరయ్యారు. వారిని చూసి గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.